Telangana: తెలంగాణలో మరో అమానుష ఘటన జరిగింది. తాగొచ్చి తల్లిని వేధించిన ఓ వ్యక్తికి మాతృమూర్తి తగిన బుద్ధి చెప్పింది. మద్యానికి బానిసై, కుటుంబాన్ని వేధిస్తున్న కుమారుడిని దారుణంగా హతమార్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ మేరకు లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ గ్రామానికి చెందిన ఎల్కపల్లి రాజ్కుమార్ అతని భార్య సుకన్య కొత్తగూడెంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. రాజ్ కుమార్ తల్లి ఎల్కపల్లి దూడమ్మ ఎదురుగడ్డలో వీరితోనే ఉంటోంది. అయితే కొంతకాలంగా మద్యానికి బానిసైన రాజ్కుమార్.. ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. తాగడానికి డబ్బులు ఇవ్వాలంటూ భార్య, తల్లిని వేధించడం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా ప్రవర్తన మార్చుకోలేదు.
Also Read: Fake Baba: మెదక్ లో ఫేక్ బాబా.. నిమ్మకాయతో మత్తు ముందు… స్పృహ కోల్పోయాక రేప్ చేస్తాడు!
ఈ కమ్రంలోనే విసిగిపోయిన తల్లి అతని బాధనుంచి విముక్తి పొందాలనుకుంది. మధ్యాహ్నం మద్యం సేవించి ఇంటికొచ్చిన కొడుకును నిద్రలో ఉండగా కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసింది. అతని మెడకు చీర, కేబుల్ వైర్లు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది. స్థానికులకు విషయం తెలియగానే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దూడమ్మను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెంలోని జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమణారెడ్డి తెలిపారు.