Crime News: గాజులరామారంలో ఇద్దరు బిడ్డల్ని వేట కొడవలితో తల్లి చంపిన ఘటన ఇంకా మరువకముందే ఇంకో తల్లి బిడ్డను చంపింది.. ఎందుకు చంపుతున్నారో కూడా తెలియదు.. సొంత బిడ్డని ఎలుకల మందు పెట్టి చంపే అంత పాపం ఎం చేసింది ఆ బిడ్డ.. అసలు ఈ తల్లులు బిడ్డల్ని చంపే అంత కర్కశంగా ఎందుకు అవుతున్నారు.. అసలు ఏం జరుగుతుంది..
మేడ్చల్ జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లే తన కంటి పాప ప్రాణాలు తీసింది. విషం పెట్టి చిన్నారిని మరో తల్లి చిదిమేసిందని స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మొన్న గాజులరామారంలో ఓ తల్లి ఇద్దరు కొడుకులను కొడవలితో నరికి దారుణంగా హత్య చేసి, ఆత్మహత్య చేసుకోడం మరువకముందే నగరంలో జరిగిన మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్ లో నాలుగు సంవత్సరాల కూతురికి విషం ఇచ్చింది. తల్లి కూడా విషం తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కూతురు మృతి చెందగా , ఆసుపత్రిలో తల్లి చికిత్స పొందుతోంది. కూకట్పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్ లో తల్లి చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు.
Also Read: Delhi: హత్య కేసులో లేడీ డాన్ జిక్రా అరెస్ట్..
కూకట్పల్లి ప్రగతి నగర్ లోని హరిత ఆర్కేడ్, ఆదిత్య గార్డెన్స్ లో సాంబశివరావు ఫ్లాట్ నెం. 102లో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య నంబూరి కృష్ణ పావని అనే మహిళ ఏప్రిల్ 18న కూల్ డ్రింకులో పి ఎలుకల మందు కలిపింది. నాలుగున్నరేళ్లు కుమార్తె జెష్వికకు కూల్ డ్రింక్ ఇచ్చి, తాను కూడా తాగింది.
మరుసటి రోజు తాము విషం తీసుకున్నామని తన భర్తకు కృష్ణ పావని తెలిపింది. అప్రమత్తమైన సాంబశివరావు ఇంటికి చేరుకుని తన భార్య, కుమార్తెను చికిత్స నిమిత్తం కేపీహెచ్బీలోని ప్రసాద్ ఆసుపత్రికి తరలించాడు. ఆమె ప్రసాద్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది.
చిన్నారి జెష్విక పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సలహా మేరకు కేపీహెచ్బీలోని రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి జెష్విక చనిపోయింది. హాస్పిటల్ యాజమాన్యం కెపిహెచ్బి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు జెష్విక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పావని భర్త పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అనారోగ్య కారణాలతో కూతురికి విషం ఇచ్చి, పావని ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

