Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగిన భారీ డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి చెందిన ఫామ్హౌస్పై ఈగల్ టీమ్ (Eagle Team) మెరుపు దాడులు నిర్వహించింది. ఈ పార్టీలో రోహిత్రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఇంకా ఇతర ప్రముఖులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో రెండు గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, మొత్తం 11 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు.
ఈగల్ టీమ్ దాడులు – గన్ఫైర్ సంచలనం
పక్కా సమాచారంతో ఈగల్ టీమ్ తనిఖీలకు వెళ్లిన సమయంలో ఫామ్హౌస్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు లోపలికి ప్రవేశించే క్రమంలో నిందితుడు నమిత్ శర్మ గన్తో కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని లొంగదీసుకుని అరెస్ట్ చేశారు. మొత్తం 11 మందికి నిర్వహించిన టెస్టుల్లో పైలట్ రోహిత్రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి మరియు అర్జున్ రెడ్డిలకు కొకైన్ పాజిటివ్ అని తేలింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు ముందు నెగిటివ్ వచ్చిన తర్వాత చేసిన టెస్ట్ లో పాజిటివ్ వచినట్టు పోలీసులు వెల్లడించారు.
-
ముఖ్య నిందితులు: పట్టుబడ్డ వారిలో ప్రియాంకరెడ్డి అనే మహిళతో పాటు మొత్తం 11 మందిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
సిమ్లా నుంచి డ్రగ్స్ సరఫరా
పోలీసుల విచారణలో ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోహిత్రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి ఈ కొకైన్ను హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా నుండి తీసుకువచ్చినట్లు నిర్ధారించారు.
రాత్రి జరిగిన పార్టీలో రోహిత్రెడ్డి పీఏ శరత్ కుమార్ అందరికీ డ్రగ్స్ పంపిణీ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన కొకైన్ కూడా శరత్ దగ్గరే ఉన్నట్లు గుర్తించారు.
డ్రగ్స్ పార్టీకి వేదికైన పైలట్ రోహిత్రెడ్డి ఫామ్హౌస్ను సీపీ యాక్ట్ ప్రకారం సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. చేవెళ్ల ఆర్డీవో నేతృత్వంలో ఈ ప్రక్రియ జరగనుంది.
నమోదు చేసిన కేసులు
మొయినాబాద్ ఎస్సై నయీముద్దీన్ ఫిర్యాదు మేరకు నిందితులపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి.
-
NDPS యాక్ట్ (Section 22): మాదకద్రవ్యాల వినియోగం మరియు నిల్వ కింద కేసు నమోదు చేశారు.
-
ఆర్మ్స్ యాక్ట్: పోలీసులపై కాల్పులు జరిపినందుకు గాను ఆయుధ చట్టం కింద కేసు పెట్టారు.
-
BNS 109: హత్యాయత్నం మరియు ఎక్సైజ్ చట్టం కింద నిందితులపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.
ప్రస్తుతం నిందితులందరినీ విచారిస్తున్న పోలీసులు, ఈ డ్రగ్స్ నెట్వర్క్తో సంబంధమున్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు చిక్కడంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
