భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ పింగ్ మధ్య భేటీ జరిగింది. 2019 తర్వాత వీరిద్దరూ అధికారిక ద్వైపాక్షిక భేటీ ఎప్పుడే జరగడం గమనార్హం.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశం కావడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఐదేళ్ల తర్వాత తమ మధ్య ఈ భేటీ జరిగిందని అన్నారు. సరిహద్దు వెంబడి గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యలపై ఏకాభిప్రాయం కుదరడాన్ని స్వాగతిస్తున్నామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరిహద్దు వెంబడి శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడం తమ ప్రాధాన్యతగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇరుదేశాలు పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం ప్రాతిపదికన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
భారత్-చైనా సంబంధాల ఆవశ్యకత ఇరు దేశాల పౌరులకు మాత్రమే ప్రయోజనకరం కాదని, ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల సమస్యలు అన్నింటిపై మాట్లాడే అవకాశం తమకు ఇవాళ దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. సానుకూలంగా, నిర్మాణాత్మకంగా ఈ చర్చలు ముందుకు సాగుతాయని విశ్వసిస్తున్నట్టు మోదీ చెప్పారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఐదేళ్ల తర్వాత తొలి అధికారిక ద్వైపాక్షిక సమావేశం ఇదేనని అన్నారు. ఇరుదేశాలకు చెందిన ప్రజలు, అంతర్జాతీయ సమాజం అంతా ఇటువైపు చూస్తున్నారని అన్నారు. ఇరు దేశాల చరిత్ర, ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశలో కొనసాగించడం ఇరుదేశాలకు, పౌరుల ఆసక్తులకు ప్రయోజనకరమని అన్నారు.
ఇరుదేశాలకు పురాతన నాగరికతలు ఉన్నాయని, రెండూ అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశాలేనని అన్నారు. ఇరుదేశాలు కీలకమైన దక్షిణ దేశాలుగా ఉన్నామని అన్నారు. ఆధునికీకరణ పురోగతిలో ముఖ్యమన దశలో ఉన్నామని జిన్పింగ్ ప్రస్తావించారు.

