Mlc kavita: బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వెలుగొందిన కల్వకుంట్ల కవిత రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి, అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
కవిత రాజీనామా లేఖను తెలంగాణ జాగృతి నాయకులు శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓఎస్డీకి అందజేశారు. అనంతరం కవిత స్వయంగా చైర్మన్ గుత్తాకు ఫోన్ చేసి, తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీనిపై గుత్తా స్పందిస్తూ, తాను ప్రస్తుతం అందుబాటులో లేనని, గురువారం మరోసారి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపినట్లు సమాచారం.
ఇక బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా లేఖను కూడా తెలంగాణ జాగృతి నాయకులే పార్టీ కార్యాలయంలో సమర్పించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డికి ఉద్దేశించిన ఈ లేఖను భవన్ సెక్రటరీ స్వీకరించి, అందుకు సంబంధించిన రసీదును జారీ చేశారు.
కవిత ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏమిటి..? ఇకపై ఆమె ఏ దిశగా సాగుతారు..? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.