Mithali Raj: భారత మహిళా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్కు అరుదైన గౌరవం లభించింది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ సందర్భంగా, ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని ఒక స్టాండ్కు మిథాలీ రాజ్ పేరు పెట్టారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్కు ముందు ఐసీసీ ఛైర్మన్ జయ్ షా, ఏపీ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ ‘మిథాలీ రాజ్ స్టాండ్’ను అధికారికంగా ఆవిష్కరించారు. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని పెవిలియన్ బ్లాక్ పక్కనే ఉన్న ఒక స్టాండ్కు మిథాలీ రాజ్ స్టాండ్గా నామకరణం చేశారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ రావి కల్పనకు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) గౌరవం ఇచ్చింది.
మిథాలీ రాజ్ స్టాండ్కు వెళ్లే గేట్కు రావి కల్పన గేట్గా పేరు పెట్టారు. భారత క్రికెట్లో ఒక మహిళా క్రీడాకారిణి పేరుతో స్టేడియంలో స్టాండ్ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్.. ఏసీఏ లోగో ఉన్న చేతితో రూపొందించిన లిమిటెడ్ ఎడిషన్ వెండి క్రికెట్ బంతిని మిథాలీ రాజ్కు బహూకరించి సత్కరించారు. మహిళా క్రికెటర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలన్న స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏసీఏ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా.. చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశాం
ఈ సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. తన క్రికెట్ ప్రయాణంలో వైజాగ్ (విశాఖపట్నం)కు ప్రత్యేక స్థానం ఉందని, ఇటువంటి గౌరవాన్ని దక్కించుకోవడం తనకు దక్కిన నిజమైన అదృష్టమని కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం రాష్ట్రంలోని బాలికలకు స్ఫూర్తినిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అరుదైన గౌరవం భారత మహిళా క్రికెట్కు ఏసీఏ ఇస్తున్న మద్దతుకు, మహిళా క్రీడాకారుల కృషికి లభిస్తున్న గొప్ప గుర్తింపుగా క్రీడాపండితులు అభివర్ణిస్తున్నారు.