minister uttam kumar reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. ఎస్ఎల్బీసీ (SLBC)లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్పై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికితీశామని, మిగతా డెడ్బాడీలను వెలికితీసేందుకు 34వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. డీ-1, డీ-2 ప్రదేశాల్లో మట్టి తవ్వకాలు, డీ-వాటరింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ బృందాలు, దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్రతికూల పరిస్థితుల్లో 24 గంటలు శ్రమిస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ఎస్ఎల్బీసీ తో పాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టులపై ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలోనే తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని కూడా ఆయన వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ విచారణ కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్ రిపోర్టు తమకు అందిందని, ప్రాజెక్ట్ డీపీఆర్ తో పాటు నిర్మాణం మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. ఈ విషయంలో ఎన్డీఎస్ఏ రిపోర్టు కోసం వారు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కేంద్ర జల్శక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ను కలవడంతో ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరితగతిన ఇవ్వాలని కోరామంటూ మంత్రి చెప్పారు. తదుపరి రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.