Seethakka: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో ములుగు జిల్లాను రద్దు చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలన్నీ కేవలం వదంతులేనని, వీటిని ఎవరూ నమ్మవద్దని ఆమె జిల్లా ప్రజలకు స్పష్టమైన భరోసా ఇచ్చారు. ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పనిగట్టుకుని బురదజల్లేందుకే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
జిల్లాల పునర్విభజన విషయంలో గత ప్రభుత్వం శాస్త్రీయంగా వ్యవహరించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అన్న మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని సీతక్క వివరించారు. ప్రజల సౌకర్యం కోసం, పరిపాలనను మరింత మెరుగుపరచడం కోసం జిల్లాల పునర్విభజనపై సమీక్ష చేస్తామని ముఖ్యమంత్రి అన్నారే తప్ప, ఉన్న జిల్లాలను తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదని ఆమె స్పష్టం చేశారు. ములుగు జిల్లా అస్తిత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఆమె తేల్చి చెప్పారు.
జిల్లా ప్రజలు ఇలాంటి పనికిమాలిన ప్రచారాలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కోరారు. ములుగు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై జాగ్రత్తగా ఉండాలని సీతక్క సూచించారు.
