దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే అని అన్నారు మంత్రి సీతక్క. సారం లేని భూమి విద్య లేని జీవితం ఒక్కటే అన్నారు.మనిషి జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.శుక్రవారం గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్య సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
సమానత్వ సాధన దిశలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. హైదరాబాద్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉందో, మరుమూల పల్లెలో అలాంటి విద్య ఉండాలని తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు అవకాశం కల్పిస్తే బాగా రాణిస్తారని అన్నారు. కానీ వారికి అవకాశాలు, వస్తువులు లేక వెనుకబాటుతనానికి గురవుతున్నారని పేర్కొన్నారు.అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అప్పుడే అందరికీ సమాన అవకాశాలు అందుతాయి. అప్పుడు సమాజంలో పోరాటాలు ఉండవు. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.
సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయి. విద్యా బోధనలో కూడా అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాల్లో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. పట్టణ ప్రాంతాలకు మెరుగైన విద్య అందుతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు.అందుకే విద్యలో ఉన్న అంతరాలను తొలగించాలని సీతక్క పేర్కొన్నారు.