Nara Lokesh: ప్రధాని మోడీ తో భేటీ తన జీవితంలో కీలక మలుపు అని, మాటల్లో వర్ణించలేనని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలు, విజ్ఞప్తులను వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీతో జరిగిన ఆయన భేటీలను గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోడీ ఎవరికీ ఇవ్వని సమయం తనకు ఇచ్చారన్నారు. మోడీ తనకు గొప్ప ప్రేరణ, స్ఫూర్తినిచ్చారని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఎలా ఎదగాలో సూచనలు చేశారని, మోడీతో సమావేశం తర్వాత ఆయన మాటలు మననం చేసుకున్నానని పేర్కొన్నారు.
సత్తెనపల్లి జగన్ పర్యటన నేపథ్యంలో నమోదైన కేసులపైనా మంత్రి లోకేశ్ స్పందించారు. ‘‘తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు. తప్పు చేసినవారిని చట్టప్రకారం శిక్షించి తీరుతాం. రాష్ట్రం తిరిగి గాడిన పెడటానికి కేంద్ర మంత్రులందరూ శ్రద్ధ చూపారు. రాష్ట్రానికి కావాల్సిన సహాయ సహకారాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రతి ఒక్కరిలో ఆలోచన ఉంది. అని మంత్రి లోకేశ్ తెలిపారు.
