Nadendla Manohar

Nadendla Manohar: తుపాను ముప్పు.. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి

Nadendla Manohar: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తుపాను హెచ్చరికల నేపథ్యంలో, రైతులు పండించిన ధాన్యాన్ని నష్టపోకుండా, కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం చిర్రావూరు, పాతూరు ప్రాంతాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో, అధికారులతో మాట్లాడి కొనుగోలు తీరును పరిశీలించారు. రైతులు పడిన కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా జాప్యం లేకుండా వేగంగా ధాన్యం కొనాలని, ఒకవేళ అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతులకు తీపికబురు చెబుతూ, ధాన్యం అమ్మిన కేవలం నాలుగు గంటల్లోనే ఆ డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 3 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ధాన్యంలో తేమ శాతం విషయంలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారమే తాము కొనుగోలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారి అనుమతులను రద్దు చేస్తామని మిల్లర్లను కూడా మంత్రి గట్టిగా హెచ్చరించారు. ఈ నిర్ణయాలన్నీ రైతులకు అండగా నిలవడానికి తీసుకున్నవే అని ఆయన తెలియజేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *