Nara Lokesh: ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈరోజు గురువారం ఉదయం నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లిన లోకేష్, ముందుగా వీరయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన సతీమణి, కుమారుడు సహా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీకి చేసిన సేవలు ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో తన వెంట నడిచిన విశ్వాస ఘనుడిగా వీరయ్య చౌదరిని కొనియాడారు. ఆయన హత్య పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన వీరయ్య చౌదరిని ఈ విధంగా కోల్పోవడం చాలా బాధాకరం. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది అని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ఉగ్ర నరసింహ రెడ్డి, బిఎన్ విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు.
