మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. గజ్వేల్ పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ను నామమాత్రంగా పెట్టి కేటీఆర్ తానే సీఎంగా భావించి, పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి, రూ.వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించి, ఆ పార్టీ అధికారం కోల్పోవడానికి కేటీఆర్ ముఖ్య కారకుడని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. పదవీ కాంక్షతో కేసీఆర్ని కేటీఆరే ఏదో చేశారన్న ప్రచారం జరుగుతోందంటూ సురేఖ కామెంట్ చేశారు.
మరోవైపు కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆ పార్టీ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. ఒక అత్యున్నత స్థానంలో ఉండి ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. కొండా సురేఖపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్పొరేటర్లు మన్నే కవితా రెడ్డి, పద్మా వెంకట రెడ్డి, దేదీప్య రావు, సామల హేమ, రాసూరి సునీత ఫిర్యాదు చేశారు.
కేటీఆర్ పై ఆరోపణలు చేసే క్రమంలో సమంత, అక్కినేని కుటుంబాలపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమవడంతోపాటు ప్రజలు, రాజకీయ పక్షాలు ఆమె తీరును ఖండించాయి. ఇప్పటికే ‘హైడ్రా’తో GHMC పరిధిలో పేదల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి సురేఖ వ్యాఖ్యలు మరింత డ్యామేజ్ కలిగించాయి. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.