Medaram Jatara 2026: గిరిజనుల ఆరాధ్యులైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మ కొలువై ఉన్న మేడారంలో జనవరి 28 నుంచి మహా జాతర ప్రారంభమవుతుంది. నాలుగు రోజులపాటు అంటే జనవరి 31 వరకు సాగుతుంది. ఇప్పటికే జాతర వేళ రద్దీని దృష్టిలో పెట్టుకొని లక్షలాది మంది మేడారం చేరుకొని ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ప్రారంభం కాకముందే మేడారం పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయడానికి అతిశయోక్తి కాదు.
Medaram Jatara 2026: జనవరి 28న ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మహాజాతర ప్రారంభమై ఇదే నెల 31వ తేదీన ముగుస్తుంది. తొలిరోజైన 28న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ అమ్మవారు గద్దెకు చేరుకుంటుంది. అదేరోజున గోవిందరాజు, పగిడిద్దరాజు ఇతర దేవతలు కూడా గద్దెలపై అధిష్టిస్తారు. ఈ ప్రక్రియతోనే మేడారంలో మహాజాతర ప్రారంభమవుతుంది. మేడారం పూజారుల సమక్షంలో ప్రత్యేక పూజలతో ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
Medaram Jatara 2026: మలిరోజైన జనవరి 29న సాయంత్రం 6 గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా కూడా పూజారుల సంప్రదాయ ప్రత్యేక పూజా కార్యక్రమాలతో అమ్మవారిని గద్దెకు చేరుస్తారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ వేడుకను తిలకించేందుకు తరలివస్తారు. పుణ్యకార్యంగా భావిస్తారు. ఆ తర్వాత మొక్కులు చెల్లించుకుంటే పుణ్యం కలిసొస్తుందని భక్తులు నమ్ముతారు.
Medaram Jatara 2026: జనవరి 30వ తేదీన లక్షలాది మంది భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. గద్దెల వద్ద బంగారాన్ని సమర్పించి మొక్కుకుంటారు. పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తజనం అక్కడి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్ద అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. మొత్తంగా ఒక కోటి నుంచి కోటిన్నర వరకు భక్తులు ఈ మేడారం మహాజాతరలో పాల్గొంటారని అంచనా.
Medaram Jatara 2026: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా గిరిజనులు ఈ జాతరకు వస్తారు. జనవరి 31వ తేదీన సాయంత్రం ఆరు గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను సంప్రదాయబద్ధంగా వనప్రవేశం చేయడంతో మహా జాతర ముగుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
