Fire Accident: హైదరాబాద్లోని మూసాపేట ప్రాంతంలో ఈరోజు (శనివారం) ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గూడ్స్ షెడ్ రోడ్డులో ఉన్న ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన చెందారు.
రసాయనాల విభాగంలో ప్రమాదం
ఈ డిపోలోని గోదాములో నిల్వ ఉంచిన రసాయన విభాగం నుంచి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. దీని కారణంగా మంటలు భారీ అగ్నికీలలుగా ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. పొగ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం ఉక్కిరిబిక్కిరి అయింది.
Also Read: Heavy Rain Alert: దూసుకొస్తున్న మంతా తుఫాన్.. ఆంధ్రప్రదేశ్కు తప్పని ముప్పు
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మరిన్ని ఫైర్ ఇంజిన్లను రప్పించే అవకాశం ఉంది. ఈ అగ్ని ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులో కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

