Medaram

Medaram: మేడారంలో భక్తుల కోలాహలం.. కిక్కిరిసిన సమ్మక్క-సారలమ్మ గద్దెలు

Medaram: ములుగు జిల్లాలోని మేడారం పుణ్యక్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పండుగ పూట తమ ఇష్టదైవాలైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవడానికి జనం పోటెత్తడంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ భక్తుల రద్దీతో నిండిపోయాయి.

భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, ఆ తర్వాత తలనీలాలు సమర్పించుకుంటున్నారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని అమ్మవార్లకు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు సమర్పించే ‘బంగారం’ (బెల్లం)తో గద్దెల ప్రాంగణం అంతా సందడిగా మారింది. సెలవు రోజులు కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో మేడారం అడవి ప్రాంతం ఒక చిన్న పట్టణాన్ని తలపిస్తోంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు, తాగునీరు మరియు ఇతర కనీస వసతులపై దృష్టి సారించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అమ్మవార్ల దర్శనం త్వరగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *