Markapuram Tragedy: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఎదురెదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మరియు టిప్పర్ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెండు వాహనాల్లోనూ భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం ఎలా జరిగింది?
పోలీసులు ఇంకా స్థానికుల సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం గురువారం ఉదయం 6:00 నుండి 6:30 గంటల మధ్య జరిగింది.
ఈ ప్రైవేట్ బస్సు నిర్మల్ నుంచి వింజమూరుకు వెళ్తన్న సమయంలో పలకల క్వారీల వద్ద ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీ మలుపు వద్ద అతివేగంతో వస్తున్న టిప్పర్, బస్సును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి డీజిల్ ట్యాంక్ పగిలి నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మంటలను గమనించిన కొంత మంది ప్రయాణికులు చాకచక్యంగా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకోగా, వెనుక సీట్లలో ఉన్నవారు మంటల ధాటికి బయటకు రాలేక లోపలే కాలిబూడిదయ్యారు.
సహాయక చర్యలు ముమ్మరం
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కనిగిరి ప్రాంతానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఘటనాస్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
అతివేగమే శాపమా?
క్వారీ ప్రాంతాల్లో టిప్పర్లు అతివేగంగా ప్రయాణించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు, టిప్పర్ రెండు కూడా పూర్తిగా అస్థిపంజరాల్లా మారిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
