Donald Trump: 2025 నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు దక్కిన విషయం తెలిసిందే. వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం, ప్రజల హక్కుల కోసం ఆమె సాగించిన నిరసనాత్మక పోరాటానికి గాను నోబెల్ కమిటీ ఈ బహుమతిని ప్రకటించింది. అయితే ఈ అవార్డు నేపథ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
శుక్రవారం వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, “నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి నేడు నాకు కాల్ చేసింది. ‘మీ గౌరవార్థమే నేను దీన్ని స్వీకరిస్తున్నాను. నిజానికి ఇది మీకే దక్కాలి’ అని ఆమె అన్నారు. అది చాలా మంచి పని” అని తెలిపారు. తన వ్యాఖ్యలతో అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తిన ట్రంప్, “అయితే నేను ఆమెకు ‘దాన్ని నాకు ఇవ్వు’ అని అనలేదు” అని చమత్కరించారు.
తాను మరియా మచాడోకు గతంలో ఎన్నో సందర్భాల్లో సహాయం చేశానని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. “నేను ఆమెకు సహాయం చేశాను, వెనిజులాలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను. అందుకే ఈ గౌరవం నాకు కూడా సంబంధించినదే అని నేను భావిస్తున్నాను” అని ఆయన అన్నారు.
మరోవైపు, నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తర్వాత మరియా మచాడో కూడా ఎక్స్ (X) లో తన స్పందనలో ట్రంప్ను ప్రస్తావించారు. ఆమె ఇలా రాశారు.. “నేను ఈ బహుమతిని వెనిజులా ప్రజలకు మరియు మా లక్ష్యానికి మద్దతుగా నిలిచిన అధ్యక్షుడు ట్రంప్కు అంకితం చేస్తున్నాను.”
ఇది కూడా చదవండి: Tennessee Explosion: అమెరికాలోని టెన్నెస్సీలో భారీ పేలుడు.. 19 మంది మృతి
ఇదే వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రంప్ అభిమానులు ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు.
అయితే ట్రంప్ తన ప్రసంగంలో మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. “నేను ఏడు యుద్ధాలను ఆపాను. ప్రతి యుద్ధానికి ఒక నోబెల్ రావాలి. రష్యా-ఉక్రెయిన్ మాత్రమే కాదు, అర్మేనియా-అజర్బైజాన్, కొసావో-సెర్బియా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరిగిన వివాదాలను కూడా నేను పరిష్కరించాను” అని ఆయన పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ట్రంప్కు మద్దతుగా ట్వీట్ చేశారు. ఆయన “ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు. ప్రపంచంలో శాంతి స్థాపనకు ఆయన చేసిన కృషి గుర్తించదగ్గది” అని పేర్కొన్నారు.
నోబెల్ కమిటీ అయితే మచాడోను “ప్రజాస్వామ్యం కోసం నిరంతరం పోరాడిన ధైర్యవంతురాలు” గా అభివర్ణించింది. “ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్న ఈ కాలంలో, ఆమె ఆశాకిరణంగా నిలిచారు” అని కమిటీ ప్రకటించింది.
ట్రంప్ వ్యాఖ్యలతో నోబెల్ బహుమతి చర్చ మరింత వేడెక్కగా, మచాడో పేరుతో నోబెల్ 2025 చరిత్రలో ఒక కొత్త అధ్యాయం రాసుకుపోయింది.