Manda krishna: దున్నపోతు” అని సంబోధించడం దారుణం

Manda krishna: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌ను “దున్నపోతు” అని సంబోధించడం దారుణమని ఆయన అన్నారు. ఇది కేవలం వ్యక్తిగత అవమానం కాకుండా, దళిత సమాజానికి అవమానంగా భావించాలంటూ మండిపడ్డారు.

మరోవైపు, తోటి దళిత మంత్రి వివేక్ ఈ వ్యాఖ్యలను ఖండించకపోగా, సమర్థించినట్లు హావభావాలు ప్రదర్శించడం కూడా సరికాదని మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ఇలాంటి సందర్భాల్లో సహచర మంత్రులు సమాజ గౌరవం కాపాడే విధంగా ప్రవర్తించాలని సూచించారు.

అడ్లూరి లక్ష్మణ్‌పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదని మంద కృష్ణ స్పష్టం చేశారు. దళితులు, బలహీన వర్గాల మధ్య విభేదాలు రాకుండా ఉండాలని కోరుతూ, తాను వెంటనే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఫోన్ చేసి సమస్యపై చర్చించానని తెలిపారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పే వరకు ఈ వివాదం పరిష్కారం కాదని ఆయన స్పష్టం చేశారు.

అడ్లూరి లక్ష్మణ్ పరిధిలో ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి అరగంట ముందుగా వెళ్లి లక్ష్మణ్ రాలేదని వ్యాఖ్యానించడం సరైన పద్ధతి కాదని మంద కృష్ణ అన్నారు. ఆ శాఖలో పొన్నం ప్రభాకర్, వివేక్ జోక్యం ఏమిటని ప్రశ్నించారు. “మీ శాఖల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటే ఊరుకుంటారా?” అని మండిపడ్డారు.

లక్ష్మణ్ ఆలస్యంగా వస్తే మేం ఉండలేమని చెప్పడం అనవసరమని, వారిని రమ్మన్నది ఎవరు, వెళ్లమన్నది ఎవరని ప్రశ్నించారు. అలాగే వివేక్ గతంలో కూడా లక్ష్మణ్‌ను అవమానించారని, తన తండ్రి కాకా 96వ జయంతి ఉత్సవాలకు ఆయనను ఆహ్వానించలేదని విమర్శించారు. “తోటి మాల సోదరుడు తోటి మాదిగ మంత్రిని ఆహ్వానించకపోతే అది సమాజానికి అపకీర్తి” అని మంద కృష్ణ మాదిగ అన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *