MSVPG Trailer: సంక్రాంతి బరిలో మెగా సందడి మొదలైపోయింది. ‘హిట్ మెషిన్’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పక్కా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ చిత్రంపై నెలకొన్న భారీ అంచనాలను రెట్టింపు చేస్తూ, ఆదివారం తిరుపతి వేదికగా చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా ట్రైలర్ను విడుదల చేసింది. మెగా అభిమానులు తమ ‘బాస్’ నుంచి ఏవైతే ఆశిస్తారో.. అంటే వింటేజ్ చిరంజీవి మార్క్ కామెడీ, అదిరిపోయే డైలాగ్ డెలివరీ మరియు గ్రేస్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ గమనిస్తే, అనిల్ రావిపూడి తనదైన శైలిలో వినోదాన్ని పండించినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మరియు లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య సాగే కెమిస్ట్రీ హైలైట్గా నిలవనుంది. “లోపలికి వచ్చి తిట్టవా ప్లీజ్” అంటూ చిరు చాలా క్యూట్గా నయనతారను అడగడం చూస్తుంటే, థియేటర్లలో నవ్వులు పూయడం ఖాయమనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి అఖండ-2
వీటికి తోడు విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో (అతిథి పాత్రలో) మెరవడం మరో ప్రధాన ఆకర్షణ. చిరంజీవి-వెంకటేష్ మధ్య వచ్చే సంభాషణలు, వారిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ మెగా మరియు ఘట్టమనేని-నందమూరి-అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా అలరించబోతున్నాయి.
సాంకేతికంగా ఈ సినిమా ఎంతో రిచ్గా కనిపిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం ట్రైలర్కు ప్రాణం పోసింది. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణాన్ని తీసుకురావడమే లక్ష్యంగా వస్తున్న ఈ ‘శంకర వర ప్రసాద్ గారు’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.
