Viral News: హైదరాబాద్ పాతబస్తీ యాకుత్పురాలో మంగళవారం ఒక ప్రమాదం తృటిలో తప్పింది. గొర్రెలకు మేత కోసం చెట్ల ఆకులు తెంపడానికి వెళ్లిన గౌస్ అనే వ్యక్తి, ఉధృతంగా ప్రవహిస్తున్న నాలా దగ్గర కాలు జారి పడిపోయాడు. ఆ సమయంలో నాలాలో వరదనీరు, మురుగు నీరు బలంగా ప్రవహిస్తున్నా, గౌస్ దగ్గర్లో ఉన్న బండను పట్టుకుని ఆగిపోయాడు.
అయితే ఈ ఘటనను గమనించిన స్థానికులు, ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ వాసే వెంటనే స్పందించారు. నిచ్చెన, తాడుతో రక్షాప్రయత్నాలు చేసి, గౌస్ను సురక్షితంగా బయటకు తీశారు. స్థానికుల చొరవతో ఒక ప్రాణం కాపాడబడటంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
గత వారం రోజులుగా హైదరాబాద్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో పాటు, రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ మరికొన్ని రోజులు భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు ప్రజలకు సూచిస్తూ — వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా నాలాలు, ముంపు ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వాహనదారులు ట్రాఫిక్ పరిస్థితులను ముందుగానే తెలుసుకుని ప్రయాణించాలన్నారు.

