Hyderabad: హైదరాబాద్లో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. డబ్బులు తీసుకుని తప్పుడు డాక్టరేట్ పట్టాలు ఇస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
రవీంద్ర భారతి వద్ద పట్టివేత
వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ నకిలీ దందా గుట్టు రట్టు చేశారు. పెద్దిటి యోహాను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రవీంద్ర భారతి ఆవరణలో పలువురికి నకిలీ డాక్టరేట్ సర్టిఫికెట్లను అందజేస్తుండగా పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అరెస్టు తర్వాత, తదుపరి విచారణ కోసం నిందితుడిని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. యోహాను వద్ద నుంచి భారీగా నకిలీ డాక్టరేట్ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
‘జాషువా పరిషత్’ పేరుతో మోసం
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యోహాను, ‘గుర్రం జాషువా స్మారక కళా పరిషత్’ అనే పేరును వాడుకుంటూ ఈ దందా నడుపుతున్నాడు.
అతను ప్రధానంగా సాహిత్యం, కళల విభాగంలో ఆసక్తి ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని, వారి నుంచి డబ్బులు తీసుకుని ఈ నకిలీ డాక్టరేట్లను ఇచ్చేవాడని పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులు నిందితుడు పెద్దిటి యోహానుపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల వెనుక ఇంకెవరి పాత్ర ఉందా, ఎంతమంది ఈ తప్పుడు డాక్టరేట్లు పొందారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి నకిలీ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.