Hyderabad: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద భారీ పేలుడు జరిగింది. నవంబర్ 10 ఆదివారం తెల్లవారుజామున చెక్పోస్టు సమీపంలోని తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్లో రిఫ్రిజిరేట్లోని కంప్రెసర్ ఒక్కసారిగా పేలింది. దీంతో పెద్ద శబ్దంతో మంటలు భారీగా చెలరేగాయి.
మంటలు పెరిగి పక్కనే ఉన్న బస్తీలోని పలు ఇండ్లు పాక్షికంగా అంటుకున్నాయి. పేలుడు ధాటికి రెస్టారెంట్ పక్కనే ఉన్న బస్తీవాసులు ఉలిక్కి పడ్డారు. భయంతో ఇండ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఎవరికీ హానీ జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు పేలుడు పై పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
ప్రమాదానికి కారణం ఏంటి? అసలు కంప్రెసర్ ఎందుకు పేలింది? వంటి విషయాలను ఆరా తీస్తున్నారు. పేలుడు కారణంగా దెబ్బతిన్న బస్తీ ఇండ్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.

