Maharashtra: పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొట్టకుండా చూడాల్సిన ఉపాధ్యాయులే స్వయంగా వారికి సహాయం చేసిన విస్తుపోయే ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. అది కూడా సాధారణ పద్ధతుల్లో కాకుండా, లేటెస్ట్ టెక్నాలజీ అయిన ‘చాట్జీపీటీ’ (ChatGPT)ని ఉపయోగించి విద్యార్థులకు సమాధానాలు చెప్పడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదంతంపై సీరియస్ అయిన విద్యాశాఖ అధికారులు ఏకంగా 81 మంది సిబ్బందిని విధుల్లో నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా బీడ్ జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది, తమ మొబైల్ ఫోన్లలో చాట్జీపీటీని వాడి ప్రశ్నలకు సమాధానాలు వెతికి మరీ విద్యార్థులకు చేరవేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి పనులకు వాడాల్సింది పోయి, ఇలా పరీక్షల్లో మోసాలకు పాల్పడటంపై బోర్డు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఈ అక్రమాలకు సహకరించిన 81 మంది టీచర్లు, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తామని, పరీక్షల పారదర్శకతను కాపాడతామని మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ స్పష్టం చేసింది.
