Maha Shivaratri 2026: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి మహాశివరాత్రి అని చెపొచ్చు. లోకనాయకుడైన పరమశివుడిని భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ పర్వదినం ఈ ఏడాది ఫిబ్రవరి 15, 2026 (ఆదివారం) నాడు వచ్చింది. శివరాత్రి అంటే కేవలం ఉపవాసం, జాగరణ మాత్రమే కాదు.. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక అంతరార్థం – పురాణ గాథలు దాగి ఉన్నాయి. భోళాశంకరుడు స్వయంగా పార్వతీదేవికి ఒక బోయవాడి కథను చెప్పడం ద్వారా ఈ రోజు చేసే పూజలోని గొప్పతనాన్ని వివరించారు.
బోయవాడి కథ: అంకితభావానికి నిదర్శనం
పూర్వం ఒక బోయవాడు అడవిలో వేటకు వెళ్లి, జంతువులేవీ దొరక్క చీకటి పడటంతో ఒక మారేడు చెట్టు ఎక్కుతాడు. క్రూర జంతువుల నుంచి రక్షణ కోసం ఆ రాత్రంతా నిద్రపోకుండా, ఆకలితో అలమటిస్తూ చెట్టు ఆకులను తెంపి కింద పడేస్తాడు. అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు (బిల్వ పత్రాలు) చెట్టు కింద ఉన్న శివలింగంపై పడతాయి.
శివరాత్రి అని తెలియకపోయినా.. అతను చేసిన ఉపవాసం (ఆకలి), జాగరణ (నిద్రపోకపోవడం), బిల్వార్చన (ఆకులు పడేయడం) కు పరమశివుడు ప్రసన్నమై అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే శివరాత్రి నాడు భక్తితో చేసే చిన్న పని కూడా అనంతమైన పుణ్యాన్ని ఇస్తుందని పండితులు చెబుతుంటారు.
శివరాత్రి జరుపుకోవడానికి 4 ప్రధాన కారణాలు
శివ పురాణం ప్రకారం ఈ నాలుగు విశేషాల వల్లే మహాశివరాత్రి అత్యంత ప్రీతికరమైనదిగా మారింది:
- లింగోద్భవం: శివుడు మొదటిసారిగా అనంతమైన జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు ఇదే. బ్రహ్మ, విష్ణువుల అహంకారాన్ని అణిచివేసేందుకు పరమేశ్వరుడు ఆది, అంతం లేని అగ్నిస్తంభంలా వెలిశాడు.
- శివపార్వతుల కళ్యాణం: శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన పవిత్ర దినం ఇది. ప్రకృతి (పార్వతి), పురుషుడు (శివుడు) ఏకమైన ఈ రాత్రి సృష్టికి మూలమని నమ్ముతారు.
- తాండవం: శివుడు సృష్టి, స్థితి, లయకారకమైన తన ‘ఆనంద తాండవం’ చేసిన రాత్రి ఇది. విశ్వం గమనాన్ని నిర్దేశించే నృత్యం ఇది.
- హాలాహలం స్వీకరణ: క్షీరసాగర మథనంలో వెలువడిన కాలకూట విషాన్ని లోకాలను రక్షించడం కోసం శివుడు స్వీకరించిన రోజు. ఆ విషం గొంతులోనే ఉండిపోవడంతో ఆయన ‘నీలకంఠుడు’ అయ్యాడు.
ఉపవాసం మరియు జాగరణ ప్రాముఖ్యత
ఈ రోజున భక్తులు చేసే ఉపవాసం శారీరక శుద్ధికి, జాగరణ మానసిక జాగృతికి సంకేతాలు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళ చేసే లింగోద్భవ కాల పూజ అత్యంత శక్తివంతమైనదని భక్తుల విశ్వాసం.
