Karur Stampede

Karur Stampede: కరూర్ ఘటనపై TVK పిటిషన్ ను కొట్టేసిన మద్రాస్ హైకోర్టు

Karur Stampede: ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట (Stampede) దుర్ఘటనపై మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ (తమిళగ వెట్రి కజగం – TVK) దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. కరూర్‌లో జరిగిన ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 41 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు, మృతుల్లో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారు.

రాజకీయ వేదికలుగా కోర్టులు వద్దు: హైకోర్టు ఆగ్రహం
ఈ కేసు విషయంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం విజయ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరూర్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున, ఈ సమయంలోనే సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా, కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇదే కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ భాజపా న్యాయవాది జీఎస్‌ మణి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది.

పార్టీలకు కోర్టు కీలక సూచనలు
విచారణ సందర్భంగా హైకోర్టు రాజకీయ పార్టీలకు కొన్ని కీలక సూచనలు చేసింది. భవిష్యత్తులో రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించేటప్పుడు ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. సభలు జరిగే ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, ఆంబులెన్స్ సేవలు, నిష్క్రమణ మార్గాలు (Exit Routes) వంటి ప్రాథమిక సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి ఒక ప్రామాణిక నిర్వహణ విధానం (SOP) రూపొందించే వరకు, హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు కూడా అనుమతి ఇవ్వమని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

Also Read: Bomb Threat: సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు!

బెయిల్ పిటిషన్ తిరస్కరణ, పరిహారంపై నోటీసులు
తొక్కిసలాట ఘటనకు సంబంధించి ముందస్తు బెయిల్‌ కోరుతూ టీవీకే నామక్కల్ జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇదిలావుండగా, బాధితులకు అదనపు పరిహారం కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది, దీనిపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

రాజకీయ విమర్శలు, పర్యటన వాయిదా
తొక్కిసలాట ఘటనపై అధికార డీఎంకే (DMK) మరియు విజయ్ పార్టీ (TVK) మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. తొక్కిసలాటపై విజయ్ చేసిన వ్యాఖ్యలకు డీఎంకే గట్టిగా బదులిచ్చింది, సినిమాల్లో మాదిరిగానే నిజ జీవితంలో కూడా విజయ్ నటన విఫలమైందని విమర్శించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించినా, విజయ్ మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించింది. దీనితో పాటు, ఈ ఘటన నేపథ్యంలో, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని విజయ్ తాను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన పర్యటనలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *