Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన దాచిపెట్టిన రూ. 15 కోట్ల అదనపు ఆదాయంపై ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ. 1.5 కోట్ల జరిమానాను కోర్టు సమర్థించింది. జస్టిస్ సెంథిల్కుమార్ రామమూర్తి ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వివాదం వెనుక ఉన్న అసలు కథ
ఈ కేసు దాదాపు పదేళ్ల క్రితం నాటిది. 2015 సెప్టెంబర్ 30న విజయ్ నివాసం, కార్యాలయాలపై ఐటీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన నటించిన ‘పులి’ సినిమా పారితోషికానికి సంబంధించి కొన్ని కీలక పత్రాలు దొరికాయి.
విజయ్కు చెక్కుల ద్వారా ఇచ్చిన రూ. 16 కోట్లకు అదనంగా, రూ. 4.93 కోట్లు నగదు రూపంలో అందినట్లు అధికారులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: TTD EO: టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు
ఐటీ సోదాల అనంతరం విజయ్ స్వయంగా స్పందిస్తూ, తనకు అందిన అదనపు ఆదాయంపై పన్ను కడతానని అంగీకరించారు. ఆ తర్వాత తన ఐటీ రిటర్న్స్లో రూ. 15 కోట్లను అదనపు ఆదాయంగా చూపారు.
కోర్టులో విజయ్ వాదన ఏంటి?
ఐటీ శాఖ జరిమానా విధించడాన్ని విజయ్ 2022లో హైకోర్టులో సవాలు చేశారు. ప్రధానంగా ‘కాలపరిమితి’ (Limitation Period) అంశాన్ని ఆయన తరపు న్యాయవాదులు లేవనెత్తారు.
- ఐటీ చట్టం ప్రకారం జరిమానా విధింపు ప్రక్రియ 2019 జూన్ నాటికే పూర్తి కావాలని, కానీ అధికారులు 2022లో నోటీసులు ఇచ్చారని వాదించారు.
- ఐటీ సోదాల వల్లే కాకుండా, తాను స్వచ్ఛందంగానే ఆ ఆదాయాన్ని వెల్లడించానని, కాబట్టి జరిమానా అవసరం లేదని పేర్కొన్నారు.
హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది?
ఐటీ శాఖ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, విజయ్ పిటిషన్ను తోసిపుచ్చారు.
సోదాల వల్లే బయటపడింది: ఐటీ అధికారులు దాడులు నిర్వహించకపోయి ఉంటే, విజయ్ ఆ రూ. 15 కోట్ల ఆదాయాన్ని వెల్లడించేవారు కాదని కోర్టు అభిప్రాయపడింది. కాబట్టి దీనిని స్వచ్ఛంద వెల్లడి కింద పరిగణించలేమని స్పష్టం చేసింది.
నోటీసులు సక్రమమే: ఐటీ అధికారులు జారీ చేసిన నోటీసుల్లో ఎటువంటి విధానపరమైన లోపాలు లేవని, చట్టం ప్రకారమే జరిమానా విధించారని పేర్కొంటూ విజయ్ రిట్ పిటిషన్ను కొట్టివేసింది.
