Madhavi Latha: షిరిడీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి మాధవీలతపై హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని అందిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
గత కొంతకాలంగా సామాజిక, రాజకీయ అంశాలపై సోషల్ మీడియాలో చురుగ్గా స్పందిస్తున్న మాధవీలత, ఇటీవల సాయిబాబాను ఉద్దేశించి చేసిన పోస్టులు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు భక్తుల నమ్మకాలను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో మాధవీలతతో పాటు ఈ వివాదాన్ని ప్రోత్సహించిన పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పేర్లను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, వీడియోలు ప్రచారం చేసిన వారిపైనా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
కేసు విచారణలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలని నిందితులందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఇతరుల మతపరమైన భావాలను కించపరిచినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఐటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
వ్యూస్, లైక్స్ కోసం వివాదాలను సృష్టించే యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా ఖాతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. చట్టాన్ని అతిక్రమించే చర్యలకు ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.
