Rangareddy: రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం, కొడిచెర్ల గ్రామ పరిసరాల్లో ఒక లారీకి మంటలు అంటుకున్న సంఘటన కలకలం సృష్టించింది. అయితే, డ్రైవర్ చూపించిన సమయస్ఫూర్తితో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పెద్ద ప్రమాదం తప్పింది. ఈ లారీ నిండా గడ్డివాము లోడుతో ఉంది. ఇది పెంజర్ల గ్రామం నుంచి మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిందిలా..
లారీ వెళ్తున్న మార్గంలో విద్యుత్ తీగలు చాలా కిందికి వేలాడుతున్నాయి. గడ్డి లోడు ఎక్కువ ఎత్తులో ఉండటంతో, లారీ ఆ తీగల కింద నుంచి వెళుతున్నప్పుడు అవి వాహనాన్ని తాకాయి. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. మంటలు అదుపు తప్పకముందే లారీని పక్కనే ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు. పరిస్థితి చేతులు దాటిపోతుందని గ్రహించి, మళ్లీ వాహనాన్ని రోడ్డు మీదకు తీసుకువచ్చి, దగ్గరలో ఉన్న ఒక ఫామ్హౌస్ వద్ద ఆపి, నీళ్లతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో లారీ వెనుక భాగం కొంత కాలిపోయింది. ఈ సంఘటన కారణంగా, కాలుతున్న గడ్డి లోడు రోడ్డుపై పడిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణికులకు కాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.
