EARTHQUAKE: మయన్మార్లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఆ భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. దీనితో ప్రజలు భయంతో తమ ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. ఆదివారం మయన్మార్లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో ఈ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. వెంటనే సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
అయితే, శుక్రవారం సంభవించిన భారీ భూకంపం కారణంగా రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది అని స్థానిక అధికారులు తెలిపారు. శుక్రవారం మయన్మార్లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 1600 మందికి పైగా మృతి చెందగా, 3400 మందికి పైగా అదృశ్యమయ్యారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగిపోతుందని అధికారులు తెలిపారు.
శనివారం ఉదయం 11.53 గంటల సమయంలో 4.3 తీవ్రతతో, మధ్యాహ్నం 2.30 గంటలకు 3.8 తీవ్రతతో, 20 నిమిషాల వ్యవధిలో 4.7 తీవ్రతతో వరుసగా ప్రకంపనలు సంభవించాయి. తాజాగా మరోసారి భూకంపం రావడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు.
అలాగే, థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న ఒక ఆకాశహర్మ్యం కుప్పకూలిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న 78 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారి జాడ ఇంకా తెలియరాలేదు. భారీ శిథిలాలను తొలగించడానికి శక్తిమంతమైన యంత్రాలను వినియోగిస్తున్నారు.