K Laxman: ప్రధాని నరేంద్ర మోదీ ఆశించిన ‘వికసిత్ భారత్’ కల నిజం కావాలంటే, ‘వికసిత్ ఆంధ్రప్రదేశ్’ నిర్మాణం చాలా కీలకమని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి ఒక గొప్ప రాజధాని ఉండటం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజధాని అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులను లక్ష్మణ్ కొనియాడారు. సుమారు 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఒక గొప్ప రాజధాని నిర్మించుకోవాలని ఏపీ ప్రజలందరూ కలలు కన్నారని, ఆ కల సాకారం కావాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా రాజధాని కోసం సుదీర్ఘకాలం పాటు పోరాటం చేసిన మహిళలకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు వారి కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావాలని అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాన్ని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోయినా, ఆయన 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారని, ఆయన బలిదానం తర్వాతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. రాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన మహనీయుల ఆశయాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పోషించిన పాత్రను లక్ష్మణ్ ప్రశంసించారు. విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు హైదరాబాద్ను ఎలా తీర్చిదిద్దారో, అదే సంకల్పంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించారని చెప్పారు. ప్రధాని మోదీ స్వయంగా అమరావతికి శంకుస్థాపన చేశారని, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అయితే, గతంలో జగన్ ప్రభుత్వం ‘మూడు రాజధానుల’ పేరుతో గందరగోళం సృష్టించి, రైతులను, మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆయన విమర్శించారు.
