KTR:బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై, ఆయన కుటుంబంపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు దోసల అనిల్ తన అనుచరులతో డిసెంబర్ 26న తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
KTR:ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. తాను గుంటూరులో చదువుకుంటే నీకేం బాధ అంటూ రేవంత్రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. తాను హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషలు నేర్చుకున్నా, నువు కూడా నేర్చుకో అని ఎద్దేవా చేశారు. నేను గుంటూరులో చదువుకుంటే, నీ అల్లుడిది భీమవరం కదా అని నిలదీశారు.
KTR:కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్ పెడితేనే రేవంత్రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని, ఇక ఆయన అసెంబ్లీకి వస్తే రేవంత్రెడ్డి గుండె ఆగి చస్తాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మా అయ్య మొగోడు, తెలంగాణ తెచ్చిన మొనగాడు అని కేటీఆర్ అన్నారు. మా అయ్య పేరు బరాబర్ చెప్పుకుంటానని స్పష్టం చేశారు. నీ లెక్క సంచులు మోసుకుంటే నీ పిల్లలు నీ గురించి చెప్పుకోరు అని ఆరోపించారు.
KTR:నీపేరు ఎనుముల రేవంత్రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్నో పథకాలను అమలు చేస్తానని, అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించిన నువ్వు మా పార్టీని విమర్శిస్తావా? అని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం ఏమైంది? మహిళలకు ఇస్తానన్న రూ.2,500 ఏమయ్యాయి? కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశావా? అంటూ నిలదీశారు.
KTR:రేవంత్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలువకుండా చేసే బాధ్యత మాది అని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి భాషను చూస్తూ పిల్లలు నేర్చుకునే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్ను వెనక్కి పంపితే ఏం చేస్తున్నావని కేసీఆర్ అడిగారని, 10 శాతం పనులు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని అడిగారని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేసీఆర్ డిమాండ్ చేశారని, దానిలో తప్పేముందని ప్రశ్నించారు.
KTR:బ్యాగులు మోసి జైలుకెళ్లి.. పేమెంట్ కోటాలో సీఎం అయ్యాడని రేవంత్రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఢిల్లీకి సంచులు మోసి పదువులను కాపాడుకుంటున్నాడని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము కోరితే నీ గుడ్లు పీకి గోటీలు ఆడుకుంటానని అంటాడని, నీ లాగుల తొండలు ఇడుస్తానని అంటాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను తిట్టాలనుకుంటే మూడు భాషల్లో పొల్లు పొల్లు తిడతానని తేల్చి చెప్పారు.
KTR:కొడంగల్లో రేవంత్రెడ్డి ఇష్టారీతిన మొరుగుతున్నాడని, అమ్మ గీతమ్మ రేవంత్రెడ్డి కట్టెయ్, లేదంటే ఎవరినన్న కరిచేలా ఉన్నాడని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తానని రేవంత్రెడ్డి శపథం చేస్తున్నాడని, జవనరి 1 నుంచి మహిళలకు రూ.2,500 ఇస్తానని శపథం చేయాలని సూచించారు.
