The Reason: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో దేశం తలదించుకుంటోంది. చరిత్రలో ఏ రాజకీయ పార్టీ పాల్పడని ఉన్మాదానికి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాల్పడింది. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ అవ్వడం రాజకీయాల్లో సహజమే. కానీ బీఆర్ఎస్ చేసింది అంతకు మించి. నేతల ఫోన్లతో పాటు వారి ఇళ్లలో ఆడవారి ఫోన్లు ట్యాప్ చేశారు. భార్య భర్తల మధ్య జరిగిన సంభాషణలను దొంగ చాటుగా విన్నారు. రాజకీయాలు దాటి.. రియల్ ఎస్టేట్, బిజినెస్ పర్సన్స్ని బెదిరించేందుకు ఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నారు. అన్నిటికన్నా హేయంగా సినీ పరిశ్రమలో ప్రముఖల జీవితాలను కబలించారు. ఈ ఫోన్ ట్యాపింగ్తో సినీ ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అందులో ప్రముఖ హీరోయిన్లు ఉన్నారు. అక్కడితో ఆగితేనా! మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి మహిళా యాంకర్ల ఫోన్లను ట్యాప్ చేశారంటే… కేసీఆర్, కేటీఆర్ల ఆధ్వర్యంలో నడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో, రాజకీయాలను ఏ స్థాయికి దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాలే మహాన్యూస్లో కథనాలుగా ప్రసారం అయ్యాయి.
వాస్తవానికి ఇందులో మహాన్యూస్ క్రియేట్ చేసింది ఏదీ లేదు. సిట్ విచారణలో వెలుగుచూస్తున్న వాస్తవాలతో పాటూ, అన్ని మీడియాల్లో ప్రసారం అవుతున్న విషయాలతో పాటూ… మహాన్యూస్కు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరమే అన్ని కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే మహాన్యూస్నే టార్గెట్ చేశాయి బీఆర్ఎస్ వర్గాలు. అందుకు కారణం మహాన్యూస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మహా వంశీ.. తన సూపర్ప్రైమ్ టైమ్ ప్రోగ్రామ్లో నిక్కచ్చిగా చెప్తున్న అంశాలే. తన సహజ ధోరణిలో, అంశాలను సామాన్యుల్లోకి చొచ్చుకెళ్లేలా, ఉన్నది ఉన్నట్లుగా, బోల్డ్గా చెప్పేరకం మహా వంశీ. అదే కేటీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని గుడ్డిగా అభిమానించే ఉన్మాద మూకలకు కట్టలు తెంచుకునే కోపం తెప్పించు ఉండొచ్చు. జర్నలిజంలో నిజాలు నిర్భయంగా చెప్తున్నప్పుడు.. ఇలాంటి దాడులకు సిద్ధంగా ఉండాలన్నది ఆ ఫీల్డ్ ఉన్న వారికి తెలిసిందే. కానీ మీడియా కార్యలయాల మీద మూక దాడులు, మీడియా చానళ్ల ఆస్తులు ధ్వంసం చేయడాలు, జీతాలకు పనిచేస్తున్న ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేయడం, తద్వారా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం… ప్రజాస్వామ్యం ఏ మాత్రం ఉపేక్షించదగింది కాదు. ఇలా జరిగిన ప్రతిసారీ… ప్రజాసంఘాలు, ప్రజల మద్ధతుతో మరింత బలంగా మీడియా ముందుకొస్తుందన్నది రాజకీయ పార్టీలు తెలుసుకుంటే మంచిది.