KTR: తెలంగాణలో యూరియా సంక్షోభం కొనసాగుతుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. రెండు నెలలుగా రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసి చూస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కేసీఆర్ పాలనలో ఎప్పుడూ రైతులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. ఆరు నెలల ముందే ఎరువుల బస్తాలు సిద్ధం చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఒక్క ప్రణాళిక కూడా లేదు. రైతులు బస్తా కోసం లైన్లలో నిలబడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో ఎరువుల కొరత లేదంటోంది. ఇది దయనీయ పరిస్థితి,” అని కేటీఆర్ అన్నారు.
రాహుల్ గాంధీని కలవడానికి వెళ్లి ‘పేపర్లు తీసుకురావడమే’ తప్ప, ఒక్క యూరియా బస్తా కూడా రేవంత్ రెడ్డి తెచ్చుకోలేదని కేటీఆర్ విమర్శించారు. రైతులు మూడు బస్తాలు యూరియా కొనుక్కుంటే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న గౌరవమా అని ఆయన ప్రశ్నించారు.
“ఒకవైపు సీఎం కొరత లేదంటున్నారు. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నాలు చేస్తున్నారు. పదేళ్లలో లేని సమస్య, ఈ ఏడాదే ఎందుకు వచ్చింది? మాకు అనుమానం ఉంది… కాంగ్రెస్ నేతలే యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. 24 గంటలు బురద రాజకీయాలు చేస్తూ రైతులను బలి తీసుకుంటున్నారు,” అని కేటీఆర్ ఆరోపించారు.
రామగుండం ఫెర్టిలైజర్ యూనిట్ను పూర్తిస్థాయిలో నడపాలని డిమాండ్ చేసిన కేటీఆర్, రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్–బీజేపీ రెండూ విఫలమయ్యాయని విమర్శించారు.