KTR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి కొందరు తెలియని విషయాలతో, అజ్ఞానంతో మాట్లాడుతుండటం దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నల్లగొండ జిల్లాకు కేసీఆర్ ఏం చేసారో తెలియక, అర్ధం చేసుకోకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.
నల్లగొండ రైతు ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా నిలిపిన నాయకుడు కేసీఆర్ అని గర్వంగా చెప్పారు. వరి పండింపులో పంజాబ్, హర్యానాలను తలదన్నేలా తెలంగాణను ముందుకు తీసుకొచ్చారన్నారు. తెలంగాణలో చివరి మడి వరకు, చివరి తడి వరకు సాగునీరు అందించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “నల్లగొండ జిల్లాకు సాగునీటిని కేసీఆర్ ప్రభుత్వం తెచ్చింది. ఎస్సారెస్సీ స్టేజ్-2 కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు సాగునీరు ఇప్పటివరకు సరిగా అందలేదు. ఎన్ఎస్పీ కింద కూడా టెయిల్ ఎండ్ గ్రామాలకు నీరు అందలేదు. కానీ కృష్ణ, గోదావరి నదుల ప్రతి నీటిబొట్టును వాడుతూ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించడం కేసీఆర్కే సాధ్యమైంది,” అని వివరించారు.
ఈ సందర్భంగా, పెదకాపర్తి ప్రాంతానికి చెందిన ఓ రైతు చెప్పిన మాటను కేటీఆర్ గుర్తు చేశారు. “మా నాయకుడు చిరుమర్తి లింగయ్య పెదకాపర్తి వద్ద ఆపి, జెండా ఎగరేయమన్నాడు. అక్కడ ఓ రైతన్న మాట్లాడుతూ, ‘అన్నా, నల్లగొండలోని ప్రజలెందుకు పాలిచ్చే ఆవును (కేసీఆర్ను) వదిలేసి, ఎగిరి తన్నే దున్నపోతులను (వ్యతిరేకులను) ఎంచుకున్నారో అడగండి’ అన్నాడు,” అని కేటీఆర్ తెలిపారు.
“తెలంగాణ రైతుల కోసం చివరి వరకు పోరాడిన నాయకుడు కేసీఆర్. నల్లగొండ జిల్లా రైతులకు కూడా ఆయన అమిత సేవలందించారు,” అని కేటీఆర్ స్పష్టంచేశారు.