KTR: తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాల్లో లొసుగులు లేకుండా చేస్తే ఏ న్యాయవ్యవస్థా అడ్డురాదని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై పార్టీలకతీతంగా అందరికీ ధ్యేయసారూప్యత అవసరమని చెప్పారు. “భావసారూప్యత లేకపోయినా ధ్యేయసారూప్యత ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పేవారు. అదే మన దారి చూపే దీపం కావాలి” అని కేటీఆర్ గుర్తుచేశారు.
“ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ బిల్లుకు మా వందశాతం మద్దతు ఉంది. కానీ, బీసీ రిజర్వేషన్లలో కేసీఆర్ ప్రభుత్వం సీలింగ్ విధించిందనడం పూర్తిగా అబద్ధం. ఈ బిల్లుకు మేము పార్టీగా గానీ, వ్యక్తిగతంగా గానీ ఎటువంటి వ్యతిరేకత చూపడం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే సమస్యపై ఐదు రకాల గొంతులతో మాట్లాడుతోందని కేటీఆర్ విమర్శించారు. “ఒకే ప్రభుత్వానికి ఐదు గొంతులు ఉండటం సరికాదు. ఏం చేయాలన్నా డిక్లరేషన్ కాదు… డెడికేషన్ కావాలి. బీసీ బిల్లుపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆమరణ దీక్ష చేయాలి. మేం అడ్డుకుంటామా? ఢిల్లీలో ధర్నా చేయాలని అంటున్నారు, మరి రాహుల్గాంధీ, ఖర్గే ఎందుకు రాలేదు?” అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Teja Sajja: బంపర్ ఆఫర్ కొట్టేసిన తేజ సజ్జ.. కల్కి 2 లో కీలక పాత్ర..?
కేసీఆర్ ధైర్యాన్ని గుర్తు చేసిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం సాధన సమయంలో కేసీఆర్ చేసిన త్యాగాలను గుర్తు చేసిన కేటీఆర్ అన్నారు.. “ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్లినా తిరిగి రాష్ట్రంలో అడుగుపెట్టింది తెలంగాణతోనే. ఆయన చిత్తశుద్ధి, తపన వల్లే రాష్ట్రం వచ్చింది. అలాంటి ధైర్యం, కట్టుదిట్టమైన వ్యూహం ఇప్పుడు అవసరం. నినాదాలు కాదు, నిజమైన కృషి చేయాలి” అని అన్నారు.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల డిమాండ్
బీసీ రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘ చర్చ జరగాలంటే కనీసం 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. “ఇది సాధారణ అంశం కాదు, సామాజిక న్యాయం కోసం కీలకమైన అడుగు. చట్టపరమైన లొసుగులు లేకుండా ఈ బిల్లును పాస్ చేస్తే ఏ కోర్టు కూడా అడ్డుకోలేరు” అని స్పష్టం చేశారు.