Ktr: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ, కొన్ని బస్తీల్లో పార్టీ వెనుకంజలో ఉందని గుర్తించారు. అలాంటి ప్రాంతాల్లో అందరూ కలిసికట్టుగా కృషి చేసి బీఆర్ఎస్ విజయాన్ని సుస్థిరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ భవన్లో జరిగిన జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, ఉప ఎన్నిక అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని తెలిపారు. మాగంటి సునీత అభ్యర్థిగా నిలిచినందుకు కార్యకర్తలందరూ అండగా ఉండాలని కోరారు. ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించడం గోపీనాథ్కు నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ను తీవ్రంగా విమర్శించిన కేటీఆర్, “ఓటుకు రూ.5 వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కానీ ప్రజలు వారి మోసపూరిత వాగ్దానాలను గుర్తుంచుకున్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేకపోయారు” అన్నారు. పేదల బస్తీల్లో ఇళ్లను కూలగొడుతూ, చెరువులో ఇళ్లు కట్టిన ముఖ్యమంత్రి సోదరుడిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు ఉంటే తొలగించాలని, లేని వారి పేర్లు చేర్చాలని సూచించారు. “పేదలకు డబ్బులు లేవంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ మూసీ ప్రాజెక్టుకు డబ్బులు కేటాయిస్తుందా?” అని ప్రశ్నించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించాలన్నారు.
అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ మంత్రిపదవి కూడా లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలుకావాలని ఆకాంక్షించారు.
మాగంటి సునీత మాట్లాడుతూ, గోపినాథ్ ఆశయాలను నెరవేర్చడం కోసం తనకు కార్యకర్తల అండ కావాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించాలన్నారు.