Krishnaiah: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టేకు నిరసనగా, అక్టోబర్ 14న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినట్లు బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నేతలు తెలిపారు అని కృష్ణయ్య మీడియాతో చెప్పారు.
హైకోర్టు స్టేకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి నిరసనగా 22 బీసీ సంఘాలు కలిసి ఈ బంద్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. “నామినేషన్ ప్రక్రియ మొదలైన సమయంలో స్టే విధించడం సరైంది కాదు,” అని అభిప్రాయపడ్డారు.
“బీసీల నోటికాడి ముద్దను లాక్కుంటున్నరు” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేస్తూ, ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు.
“వ్యవస్థలపై, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికే ఈ బంద్ పిలుపు,” అని కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీలను చిన్నచూపు చూస్తున్న వారందరికీ ఈ బంద్ ద్వారా బీసీల సత్తా చూపిస్తామని ఆయన హితవు పలికారు.