Konda Surekha: రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు గడ్డుకాలం వచ్చిందా? ఆమెకు అండలేకుండా పోయిందా? అసలు ఆమె పదవికే ఎసరు వచ్చిందా? గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తాజాగా నిన్నటి నుంచి నేటి వరకూ ఒక్కొక్కటిగా జరుగుతున్న ఉదంతాలు ఆమె పదవిని తొలగించే చర్యలే మెందుగా కనిపిస్తున్నాయి.
Konda Surekha: కొండా సురేఖ శాఖలో ఓఎస్సీడీగా పనిచేసిన సుమంత్ను ప్రభుత్వం తొలగించింది. అతనిపై పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయి. ఉద్యోగులనే కాకుండా, బయట కూడా జరిగిన దందాల్లో ఆయన పాత్ర ఉన్నట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న (అక్టోబర్ 15) రాత్రి హైదరాబాద్లోని కొండా సురేఖ నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు.
Konda Surekha: ఆ సమయంలో అక్కడ ఉన్న మంత్రి కూతురు కొండా సుస్మితాపటేల్ పోలీసులపై ఫైర్ అయ్యారు. మంత్రి ఇంటికే ఎలా వస్తారంటూ, ఏం పనిపై వచ్చారు, సుమంత్ ఏం చేశారని వచ్చారు? అంటూ పలు ప్రశ్నల వర్షం కురిపించారు. అదే రోజు కొండా సురేఖ తన కారులో సుమంత్ను తీసుకొని బయటకు వెళ్లారని సాక్షులు చెప్తున్నారు. అనంతరం కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఏకంగా ప్రభుత్వ పెద్దలపై విరుచుకుపడ్డారు. బీసీ మంత్రి అయిన తన అమ్మను రెడ్డి మంత్రులు ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
Konda Surekha: ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లా కేంద్రంలో మంత్రి కొండా సురేఖకు చెందిన నివాసం వద్ద పోలీస్ భద్రతను తొలగించారు. మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతోపాటు పోలీస్ ఔట్ పోస్టును కూడా తొలగించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే మరో బాంబ్ పడినట్టయింది. కొండా సురేఖ దేవాదాయ శాఖలోని ఫైళ్లు అన్నింటినీ అప్పగించాలని అక్కడి అధికారులకు సీఎం రేవంత్రెడ్డి నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది.
Konda Surekha: ఇంకా కొద్దిసేపట్లో మంత్రి కొండా సురేఖ మీడియా ముందుకు రానున్నారని తెలుస్తున్నది. తన ఓఎస్డీ సుమంత్ వివాదంపై, డెక్కన్ సిమెంట్ వివాదంపై స్పందించనున్నరని సమాచారం. ఆయా అంశాలపై తనకేమీ సంబంధం లేదని కొండా మురళి వ్యాఖ్యానించినట్టు మీడియా వార్తలు అందాయి. మరి కొండా ఏం మాట్లాడనున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్న అంశాలపై ఉత్కంఠ నెలకొన్నది.
