Komatireddy Venkatreddy: : రీజినల్ రింగ్ రోడ్డుకు (RRR) సంబంధించిన అన్ని అనుమతులను రెండు నెలల్లో మంజూరు చేస్తామని, అన్ని క్లియరెన్స్లు వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు తెలిపారు.
గడ్కరీతో భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సంగారెడ్డి-భువనగిరి-చౌటుప్పల్ వరకు RRR టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. అదనంగా, దాదాపు 95% భూసేకరణ కూడా పూర్తయిందని, రూ. 1,000 కోట్లతో 12 ఆర్వోబీలు (రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు) మంజూరు చేసినట్టు వెల్లడించారు.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంబంధిత అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.
అలాగే, హైదరాబాద్ నుండి మచిలీపట్నం వరకు రహదారి విస్తరణ ఆలస్యమవుతోందని, గుడిమల్కాపూర్ నుండి విజయవాడకు ఒక ప్యాకేజీగా, విజయవాడ నుండి మచిలీపట్నం వరకు మరో ప్యాకేజీగా విభజించి టెండర్లు పిలవాలని గడ్కరీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుపై త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, దీనిపై చర్చిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితెలిపారు.