Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ తప్పనిసరి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూస్తామని ఆయన అన్నారు.
ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్లో దాదాపు 4 లక్షల డబుల్ ఓట్లు ఉన్నాయని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. “మేమే ఓట్లు దొంగలిస్తే లోక్సభలో బీజేపీ సీట్లు తగ్గేవి ఎందుకు?” అని ఆయన ప్రశ్నించారు.
యూరియా సరఫరాపై హామీ
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా సరఫరా అంశంపై ఫోన్లో మాట్లాడారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, వాటాను తప్పకుండా పంపిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రామగుండం ఫ్యాక్టరీలో సాంకేతిక సమస్యల కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిందని వివరించారు.
పార్టీ ఫిరాయింపులపై స్పందన
పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ విషయంలో ఒకే తాటిపై ఉన్నాయని విమర్శించారు. బీజేపీలో చేరదలచిన వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలి అని ఆయన స్పష్టం చేశారు. మొయినాబాద్ ఫాం హౌస్ కేసుతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మరోసారి తేల్చి చెప్పారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణకు హామీ
హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోందని, అందువల్ల ఎల్ అండ్ డీ సంస్థ కొత్త లైన్ల నిర్మాణంపై ఆసక్తి చూపడం లేదని అన్నారు. అయితే, మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
బీహార్లో బీజేపీ తప్పకుండా అధికారం చేపడుతుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.