Kavitha

Kavitha: TRS పేరుపై కవిత సంచలన వ్యాఖ్యలు.. ఎవరైనా వాడుకోవచ్చు!

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గతంలో తమ పార్టీ పేరుగా ఉన్న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (TRS) ఇప్పుడు ఖాళీగా ఉందని, ఆ పేరును ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చని వ్యాఖ్యానించారు. పాత పేరుతో కానీ, కొత్త అజెండాతో కానీ మళ్ళీ ప్రజల ముందుకు వస్తానని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ, తమ ప్రయాణం ఎప్పుడూ ఆచార్య జయశంకర్ సార్ ఆశయాల ప్రకారమే జరుగుతుందని కవిత తెలిపారు. తమ పార్టీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యూహకర్తలు గానీ, సిద్ధాంతకర్తలు గానీ ఎవరూ లేరని ఆమె నొక్కి చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ (BRS) పార్టీ కొంత కాలంగా నిద్రావస్థలో ఉందంటూ ఆమె విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా కవిత గళమెత్తారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల పెంపు మధ్యతరగతి కుటుంబాలకు పెను భారంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా 30 నుంచి 40 శాతం వరకు ఫీజులు పెంచేస్తున్నా, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సరికాదని విమర్శించారు. అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే ‘ఫీజుల నియంత్రణ చట్టాన్ని’ తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *