Kavitha

Kavitha: నేటి నుంచి కవిత జాగృతి జనం బాట ప్రారంభం

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, శనివారం (అక్టోబర్ 25) నుంచి సుదీర్ఘ ‘జాగృతి జనం బాట’ యాత్రను ప్రారంభించనున్నారు. ఆమె తన భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

కొత్త రాజకీయ మలుపు
ప్రజల ఆకాంక్ష మేరకే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని కవిత ఇటీవల సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో, ఈ యాత్రకు ప్రాధాన్యత పెరిగింది. నాలుగు నెలలపాటు సాగే ఈ యాత్రలో ఆమె రాష్ట్రంలోని 33 జిల్లాలలో పర్యటించి, ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఈ పర్యటన ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుంది.

కవిత తాను ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్‌ నుంచే ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, నిజామాబాద్‌కు బయలుదేరారు. అక్కడ మధ్యాహ్నం 1 గంటకు ఇందల్వాయి టోల్‌గేట్ వద్దకు చేరుకుని, బైక్ ర్యాలీలో పాల్గొని, జాగృతి కార్యాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం నవీపేట మండలం యంచ వద్ద ముంపు బాధితులతో సమావేశమవుతారు.

Also Read: Liquor Shop: మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు.

యాత్రలో ప్రధాన అంశాలు
ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు ఉండేలా రూపొందించిన ఈ కార్యాచరణలో కవిత విద్యావంతులు, రైతులు, కూలీలు, మహిళలు, యువతతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ యాత్రలో ప్రజా సమస్యలు, హక్కులు ప్రధాన చర్చాంశాలుగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.

యాత్ర పోస్టర్లలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఫోటో లేకపోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ మార్గాల వేరుపాటును కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ యాత్రలో ఆమె ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

యాత్రతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కవిత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గ్రూప్-1 నియామకాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. దీనిపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌కు లేఖ రాసి, సుమోటో విచారణ కోరారు. అలాగే, వీవోఏల (విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్) హక్కుల కోసం ఇందిరాపార్కు వద్ద జరిగిన మహాధర్నాలో పాల్గొని, వారి వేతనాన్ని రూ.8 వేల నుంచి రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా కవిత చర్యలు తీసుకుంటున్నారని, భవిష్యత్తు రాజకీయాల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాల యాత్ర పూర్తయ్యే నాటికి కవిత కొత్త పార్టీ ప్రకటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *