Kavita: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఈ స్కాంలో ముఖ్యపాత్ర హరీశ్ రావుదేనని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లతో కలిసి ఈ పని చేశారని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై జరుగుతున్న సీబీఐ విచారణ, అవినీతి ఆరోపణల వెనుక పార్టీలోని కొందరు కీలక నేతల పాత్ర ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కవిత తన ఆరోపణలను ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోష్రావులపై సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో వీరిద్దరి పాత్ర కీలకమని ఆమె అన్నారు. హరీశ్రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నందువల్లే కేసీఆర్కు ఈ చెడ్డపేరు వచ్చిందని, అందుకే ఆయన్ని ఆ మంత్రి పదవి నుంచి తొలగించారని స్పష్టం చేశారు. కేసీఆర్ను అడ్డుపెట్టుకుని హరీశ్రావు, సంతోష్రావు భారీగా ఆస్తులు కూడబెట్టారని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. వారికి డబ్బు తప్ప మరొకటి అవసరం లేదని ఆమె చెప్పారు.
హరీశ్రావు, సంతోష్రావు వెనుక ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ఆరోపించారు. వీరి ముగ్గురి మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరిందని, అందుకే రేవంత్ రెడ్డి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు. “నా తండ్రిపైనే బాణం వేస్తారు, రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలి” అని కవిత సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ అజెండా కాకుండా పక్క రాష్ట్ర అజెండాను అమలు చేసే వ్యక్తి అని కవిత తీవ్ర విమర్శలు చేశారు.

