Kavitha; బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ (హెచ్ఎంఎస్) గౌరవ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో జరిగిన హెచ్ఎంఎస్ జనరల్ బాడీ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు పలు కీలక డిమాండ్లను ముందుకు తెచ్చారు. వీటిలో పాత వీఆర్ఎస్ స్కీమ్ను పునరుద్ధరించడం, వేలంపాట లేకుండా తెలంగాణ బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించడం, సింగరేణి కార్మికులకు పెర్క్స్ రీయింబర్స్మెంట్ కింద ఐటీ రిటర్న్స్ అందించడం, మారుపేర్ల కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులను వన్టైమ్ సెటిల్మెంట్ కింద క్రమబద్ధీకరించడం, అనారోగ్యంతో అండర్గ్రౌండ్ పనికి అనర్హులైన వారికి సూటబుల్ జాబ్స్ కల్పించడం, కార్మికులకు సొంతింటి పథకాన్ని అమలు చేయడం, పెండింగ్ విజిలెన్స్ కేసులను క్రమబద్ధీకరించడం, జైపూర్ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న భూనిర్వాసితులను రెగ్యులరైజ్ చేయడం, కంపెనీ లాభాల్లో కార్మికులకు వాటా కల్పించడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ తీర్మానాల సాధనకు కవిత అండగా నిలుస్తారని యూనియన్ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
