Kavitha: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించి తనపై జరుగుతున్న పరిణామాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించిన కవిత, హరీష్రావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “హరీష్రావు ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన ప్రాణం పోయినా కేసీఆర్కు అన్యాయం జరగనివ్వనని ఆమె స్పష్టం చేశారు.
వేరే పార్టీలో చేరికపై స్పష్టత
తాను ఎలాంటి పార్టీకి వెళ్లబోవడం లేదని, తనకు ఎలాంటి పార్టీతో సంబంధం లేదని కవిత ఖండించారు. జాగృతి కార్యకర్తలు, మేధావులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. “గొడవల కారణంగా అమ్మకు కూడా దూరంగా ఉండాల్సి రావడం బాధాకరం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Kavitha: భవిష్యత్తులో KTR, KCRలపై కుట్రలు.. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్!
“నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది”
బీఆర్ఎస్, తెలంగాణ కోసం 20 సంవత్సరాల తన జీవితాన్ని వెచ్చించానని కవిత గుర్తు చేశారు. సస్పెన్షన్పై మరోసారి ఆలోచించాలని కోరారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ను ఓడించేందుకు హరీష్రావు ప్రత్యర్థి పార్టీలకు నిధులు పంపారంటూ సంచలన ఆరోపణ చేశారు. పోచంపల్లి, మోకిలాలో వందల కోట్ల ప్రాజెక్టులు పొందిన హరీష్, సంతోష్లు బీఆర్ఎస్ను పట్టిపీడిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీతో ఈ ఇద్దరూ సఖ్యత పెంచుకుంటున్నారన్నారు.
భవిష్యత్పై సంకేతాలు
“నిజాయితీ నిరూపించుకునేందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను” అని కవిత అన్నారు. ప్రజలు తనతో ఉన్నారని, ఇకముందు వారితోనే ఉంటానని స్పష్టం చేశారు.

