MLA: కైకలూరు రాజకీయాల్లో సీనియర్ నేతగా, బీజేపీ ముఖ్య నాయకుడిగా పేరుగాంచిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయాల నుంచి తాను తప్పుకోవడమే కాకుండా, తన వారసులు కూడా భవిష్యత్తులో ఎన్నికల బరిలో ఉండబోరని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు అఖండ మెజారిటీతో విజయం సాధించి అధికార పక్షంలో కొనసాగుతున్న తరుణంలో, ఆయన ఈ స్థాయి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నిజానికి తాను రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పుకోవాలని భావించినప్పటికీ, ప్రజలు మరియు అభిమానుల కోరిక మేరకే 2024 ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చిందని కామినేని గుర్తు చేసుకున్నారు. ప్రజలు ఎవరూ ఊహించని విధంగా తనకు భారీ మెజారిటీని కట్టబెట్టి అండగా నిలిచారని, ఈ విజయం తనపై బాధ్యతను మరింత పెంచిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Ibomma Ravi: ఐబొమ్మ రవికి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు
అయితే, భవిష్యత్తులో మాత్రం తాను కానీ, తన కుటుంబం నుంచి మరెవరూ కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. పదవులకు అతీతంగా సమాజానికి మంచి పనులు చేయడం ద్వారానే గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు.
రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిస్తూనే, నియోజకవర్గంలో శాంతిభద్రతల విషయంలో అధికారులకు మరియు కార్యకర్తలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కైకలూరు నియోజకవర్గంలో ఎవరైనా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అవినీతి లేని పాలన అందించడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
మరోవైపు, రానున్న సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ ప్రజలకు ఆయన ఒక పిలుపునిచ్చారు. ‘జూదాలు వద్దు – సాంప్రదాయ క్రీడలే ముద్దు’ అనే నినాదంతో పండుగ స్ఫూర్తిని కాపాడాలని కోరారు. కోడి పందాలు, పేకాట వంటి వ్యసనాలకు దూరంగా ఉండి, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే క్రీడలతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఒక సీనియర్ నాయకుడు తన రాజకీయ ప్రస్థానం ముగింపుపై ఇంత స్పష్టమైన ప్రకటన చేయడం, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.
