Kadiyam srihari: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. తన నియోజకవర్గానికి ఎక్కువ నిధులు, అభివృద్ధి పనులు రావడానికి అధికార పార్టీ సహకారం అవసరమైందని చెప్పారు.
ఈ నెల 23వ తేదీలోపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సమాధానం ఇవ్వాలని సభాపతి నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నోటీసులు అందాయని శ్రీహరి తెలిపారు. అయితే వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరగా, సభాపతి సానుకూలంగా స్పందించారని చెప్పారు.
సభాపతి ఇచ్చిన గడువులోగా తమ వివరణను సమర్పిస్తానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అలాగే, సభాపతి తీసుకునే నిర్ణయానికి తాను పూర్తిగా కట్టుబడి ఉంటానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టితో కలిసి పనిచేయడం వల్ల స్టేషన్ ఘనపూర్ ప్రాంతానికి గణనీయమైన అభివృద్ధి ఫలితాలు వచ్చాయని వివరించారు.
ప్రతి గ్రామంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. తాను ఎవరికీ భయపడనని, ఎప్పుడూ ప్రజల మంచికే పనిచేస్తానని చెప్పారు. ఒకవేళ స్టేషన్ ఘనపూర్లో ఉప ఎన్నికలు జరిగితే మళ్లీ పోటీ చేస్తానని కూడా కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఆశీర్వదిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.
