Kavitha: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పెట్టిన ఒకే ఒక్క పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో, కవిత కేవలం “కర్మ హిట్స్ బ్యాక్” (కర్మ ఎవరినీ వదిలిపెట్టదు) అని ట్వీట్ చేసి, దండం పెడుతున్న ఎమోజీలను జతచేశారు.
Also Read: CM revanth: ప్రజాసేవే కాంగ్రెస్ లక్ష్యం, GHMCలో కూడా విజయం సాధిస్తాం
ఈ ట్వీట్ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే చర్చకు దారి తీసింది. ఎందుకంటే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఈ ఓటమిని ఉద్దేశించే కవిత ఈ వ్యాఖ్య చేశారని భావిస్తున్నారు. ఈ వ్యాఖ్య వెనుక, కవితను పార్టీ నుంచి అవమానించి బయటకు పంపిన పరిణామాలు లేదా పార్టీలో ఆమెకు ఎదురైన అంతర్గత విభేదాలు ఉన్నాయని, ఆ పరిణామాలనే ఉద్దేశిస్తూ ఆమె ఈ ట్వీట్ చేశారని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఏదేమైనా, జూబ్లీహిల్స్ ఫలితం వెలువడిన వెంటనే వచ్చిన ఈ ట్వీట్ బీఆర్ఎస్ పార్టీ పెద్దలను, అంతర్గత రాజకీయ పరిణామాలను ఉద్దేశించే చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
