Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ దిగ్గజం, మాజీ మంత్రి టి. జీవన్రెడ్డి బుధవారం తన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేశారు. జగిత్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన భారీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ జెండా మోసిన తనకు పార్టీలో జరిగిన అన్యాయాన్ని భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నన్ను అణగదొక్కాలని చూశారు: జీవన్రెడ్డి ఆగ్రహం
రాజీనామా ప్రకటించిన అనంతరం జీవన్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. “పార్టీ కోసం రక్తం ధారపోసిన నన్ను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కాలని చూశారు. నేను కనీసం మంత్రి పదవికి కూడా అర్హుడిని కాదా? కాంగ్రెస్లో పాతవారిని తొక్కుకుంటూ కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకెవరూ ఎదగకూడదనే ధోరణి పార్టీలో పెరిగిపోయింది” అని ఆయన మండిపడ్డారు.
రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా
రాజకీయాల్లో తాను ఎప్పుడూ రాజీపడలేదని జీవన్రెడ్డి స్పష్టం చేశారు. “గతంలో ప్రజా సమస్యలపై చంద్రబాబు, కేసీఆర్ వంటి హేమాహేమీలపై పోరాటం చేశాను. ఇప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డిపై నా పోరాటం మొదలవుతుంది” అని ఆయన యుద్ధం ప్రకటించారు. రాజ్యసభ సీట్ల కేటాయింపులో వేం నరేందర్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ఎంతమంది సీనియర్లను ఇలా తొక్కుకుంటూ వెళ్తారని ఆయన ప్రశ్నించారు.
జగిత్యాలలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
జీవన్రెడ్డి రాజీనామాతో జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భారీగా దెబ్బతినే అవకాశం ఉంది. జిల్లాలోని కేడర్ అంతా ఆయన వెంటే నడుస్తుండటంతో అధికార పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. తన భవిష్యత్ కార్యాచరణను అనుచరులతో చర్చించి త్వరలోనే ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. ఈ రాజీనామా పర్వం తెలంగాణ కాంగ్రెస్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తోంది.
